ముంబై : ఏడాదిన్నరగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న బాలిక బలవన్మరణానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని థానే సమీపంలోని కళ్యాణ్లో వెలుగుచూసింది. తాను నివసిస్తున్న అపార్ట్మెంట్లోని మూడో అంతస్తు నుంచి కిందకు దూకి బాలిక ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి మహిళ సహా ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి మొబైల్ ఫోన్ నుంచి సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించడంతో ఏడాదిన్నరగా ఆమె ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, మానసిక ఒత్తిడి వెలుగుచూసింది.
బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన నిందితులు ఆమె అభ్యంతరకర వీడియోను తీసి బ్లాక్మెయిల్కు గురిచేశారు. ఆమెను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపేందుకు ఒత్తిడి చేశారు. మృతురాలి స్నేహితురాలు మరో ఏడుగురు బాధితురాలిని లైంగిక వేధింపులకు గురిచేయడంలో సహకరించిందని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని కొల్సెవాది ఎస్ఐ తెలిపారు.
నిందితులను సన్నీ పాండే, విజయ్ యాదవ్, ప్రయం తివారీ, శివం పాండే, కృష్ణ జైస్వాల్, ఆనంద్ దూబే, నిఖిల్ మిశ్రా, కాజల్ జైస్వాల్గా గుర్తించారు. నిందితులు పలుకుబడి కలిగిన వారని వారిపై చర్యలు చేపట్టడంలో పోలీసులు విఫలమయ్యారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. తమ కుమార్తెపై లైంగిక దాడి చేసి ఆపై బ్లాక్మెయిల్ చేశారని, టెర్రస్ పైనుంచి తోసివేశారని ఆయన చెప్పారు. తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు.