హైదరాబాద్ : హైదరాబాద్లోని బోరబండకు చెందిన ఓ డ్రైవర్ వృత్తిరీత్యా.. 10 మందితో గోవా వెళ్లాడు. గత నెల 19వ తేదీన గోవా వెళ్లిన డ్రైవర్.. సరిగ్గా 20 రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు. అయితే అతని తలకు, శరీరానికి ఉన్న కుట్లను చూసి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
19న గోవా వెళ్లిన డ్రైవర్ శ్రీనివాస్.. 20వ తేదీన అదృశ్యమయ్యాడు. దీంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు మిగతా వారు సమాచారం అందించారు. ఈ క్రమంలో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు గోవా వెళ్లి అతని ఆచూకీ కోసం గాలించారు. శ్రీనివాస్ అదృశ్యంపై గోవాలోని అంజునా పీఎస్లో ఫిర్యాదు చేశారు. చేసేదేమీ లేక డ్రైవర్ కుటుంబ సభ్యులు బోరబండకు తిరిగొచ్చారు. సరిగ్గా 20 రోజుల తర్వాత ఇంటికొచ్చిన శ్రీనివాస్ తలకు, కడుపు భాగంలో కుట్లు ఉండటంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు నిమ్స్కు తరలించారు. అయితే శ్రీనివాస్కు మత్తు మందు ఇచ్చి అవయవాలు తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో 8 మంది గోవాలో ఇదే పరిస్థితిలో ఉన్నట్లు శ్రీనివాస్ చెబుతున్నాడు.