చండీగఢ్: ఒక గుడిసెకు మంటలు అంటుకోవడంతో అందులో నిద్రిస్తున్న ఐదుగురు పిల్లలతో సహా ఏడుగురు సజీవ దహనమయ్యారు. పంజాబ్లోని లూధియానాలో బుధవారం తెల్లవారుజామున ఈ విషాదకర ఘటన జరిగింది. కొందరు వలస కార్మికులు టిబ్బా రోడ్డులోని మున్సినల్ చెత్త డంపింగ్ యార్డ్ సమీపంలో గుడిసెలు నిర్మించుకుని ఉంటున్నారు. బుధవారం ఉదయం 2 గంటలకు ఒక గుడిసెకు మంటలంటుకున్నాయి. దీంతో అందులో నిద్రిస్తున్న కుటుంబంలోని ఐదుగురు పిల్లలతో సహా ఏడుగురు సజీవ దహనమయ్యారు.
మృతుల్లో భార్యాభర్తలతోపాటు వారి ఐదుగురు పిల్లలు ఉన్నట్లు టిబ్బా పోలీస్ స్టేషన్ ఎస్ఐ బలదేవ్ రాజ్ తెలిపారు. మరణించిన భార్యాభర్తలు వలస కూలీలని చెప్పారు. ఆ గుడిసెకు మంటలు ఎలా వ్యాపించాయో అన్నది తెలియలేదన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు. కాగా, ఐదుగురు పిల్లలతో సహా ఏడుగురు సజీవ దహనమైన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ ప్రాంతంలో విషాదం నెలకొన్నది.