Crime News | హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): మానవ సంబంధాలు దిగజారిపోతున్న వేళ.. మనస్సు కలచివేసే ఘటన ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా పత్తికొండలో జరిగింది. పత్తికొండ వాసి పోతుగంటి హరికృష్ణ ప్రసాద్ (60) అనారోగ్యంతో బాధపడుతూ మరణించాడు. ఆయన మృతదేహానికి హరికృష్ణ ప్రసాద్ భార్య లలిత.. అట్టపెట్టెలతోనే దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఇలా భర్త మృతదేహానికి అట్టపెట్టెలతో దహన సంస్కారాలు పూర్తి చేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది.
తమ కుమారులు తమను సరిగ్గా చూసుకోవడం లేదని లలిత ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తమ వద్ద ఉన్న ఆస్తి కోసమే తమ కుమారులు వస్తున్నారన్న ఆవేదనతోనే ఈ పని చేసినట్లు పోలీసులకు తెలిపారు. తన భర్త మరణ వార్త తెలియగానే వచ్చి తమ కుమారులు ఆస్తి కోసం గొడవ చేస్తారని, అందుకే అట్టపెట్టెలతో దహన సంస్కరాలు పూర్తి చేశానని ఆవేదనతో చెప్పారు.
పత్తికొండ పట్టణ వాసి పోతుగంటి హరికృష్ణ ప్రసాద్ (60), లలిత భార్యాభర్తలు. తెరుబజార్లో హరికృష్ణ మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు దినేశ్ కర్నూలులోని ఓ ప్రైవేట్ దవాఖానలో పని చేస్తున్నాడు. రెండో కుమారుడు కెనడాలో స్థిరపడ్డాడు.
సోమవారం హరికృష్ణ ఇంట్లో నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో కంగారు పడ్డ స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లోకి ప్రవేశించి లలితను విచారించారు. ఆమె చెప్పిన సమాధానంతో షాకయ్యారు. తన భర్త కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్నాడని, సోమవారం ఉదయం అకస్మాత్తుగా చనిపోయారని ఆమె తెలిపారు.. తండ్రి మరణ వార్త తెలిస్తే ఇంటికి వచ్చి ఆస్తి కోసం గొడవ చేస్తారని, అందుకే తానే అట్టపెట్టెలు వేసి తగలపెట్టి దహన సంస్కారాలు పూర్తి చేసినట్లు పోలీసులకు వివరించారు.