చండీఘఢ్ : హరియాణకు చెందిన చిన్న పట్టణం ఫతేబాద్లో పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపుతోంది. గత నాలుగు నెలలుగా ఫతేబాద్ పోలీసులు 2 కిలోలకు పైగా హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు.
మార్కెట్లో ఈ డ్రగ్స్ విలువ రూ 2 కోట్ల వరకూ ఉంటుందని వెల్లడించిన పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద 84 కేసులు నమోదు చేశారు. 2022లో ఇప్పటివకూ రూ 2 కోట్ల విలువైన రెండు కిలోలకు పైగా హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నామని ఫతేబాద్ డీఎస్పీ సుభాష్ చంద్ర పేర్కొన్నారు.
ఆయా కేసుల్లో పలువురు డ్రగ్ స్మగ్లర్లను అరెస్ట్ చేశామని చెప్పారు. డ్రగ్ స్మగ్లర్లపై యాంటీ నార్కోటిక్స్ బృందం ఉక్కుపాదం మోపుతోందని అన్నారు. ఇక మంగళవారం రాత్రి ఫతేబాద్ పోలీసులు 302 గ్రాముల హెరాయిన్ను సీజ్ చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారని తెలిపారు.