Online Trading Scam : దేశవ్యాప్తంగా ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్లు పెరిగిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. గత కొద్ది వారాలుగా పదుల సంఖ్యలో వ్యక్తులు ఈ తరహా స్కామ్స్లో లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు. ఇక లేటెస్ట్గా గురుగ్రామ్కు చెందిన డాక్టర్ సైబర్ నేరగాళ్ల చేతిలో భారీగా మోసపోయారు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పేరుతో సైబర్ నేరగాళ్ల మాయాజాలానికి గురుగ్రాం కేంద్రీయ విహార్ సొసైటీకి చెందిన డాక్టర్ పునీత్ సర్దానా ఏకంగా రూ. 2.5 కోట్లు నష్టపోయారు. ఈ ఏడాది జనవరి 4న ఆన్లైన్ వేదికగా స్టాక్ మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కు సంబంధించిన ప్రకటన ఆయనను ఆకట్టుకుంది.
ఆన్లైన్ స్టాక్, ఐపీఓ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా భారీ లాభాలను ఆర్జించవచ్చని నేరగాళ్లు డాక్టర్ పునీత్ సర్ధానాకు నమ్మబలికారు. ప్రకటనలో ఇచ్చిన ఫోన్ నెంబర్కు ఆయన కాల్ చేయడంతో కాలర్ ఆయనకు వాట్సాప్ ద్వారా లింక్ పంపారు. ఆపై షేర్ల కొనుగోలు కోసం యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సైబర్ నేరగాళ్లు డాక్టర్ సర్దానాను కోరడంతో ఆయన అలాగే చేశారు. యాప్ పనితీరుపై సంతృప్తి చెందిన సర్దానా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు. తొలుత రూ. 50,000 వెచ్చించి షేర్లు కొనుగోలు చేశారు. ఇక తొలిగా తన పెట్టుబడులు మెరుగైన రాబడి ఇవ్వడంతో ఆపై ఓ ఐపీఓలో పెట్టుబడి పెట్టారు.
ఇక యాప్లో తన అకౌంట్ బ్యాలెన్స్ భారీ లాభాలతో ఏకంగా రూ. 3.19 కోట్లు చూపింది. తన లాభాలను విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా విత్డ్రాయల్స్కు అనుమతించలేదు. తన ఫండ్స్కు యాక్సెస్ లేకపోవడంతో డాక్టర్ సర్దానా స్కామర్లను సంప్రదించారు. విత్డ్రాయల్ ప్రక్రియ సాఫీగా సాగాలంటే అదనపు డబ్బును సెక్యూరిటీ డిపాజిట్స్ కింద వెచ్చించాలని నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన బాధితుడు పలు లావాదేవీల్లో రూ. 1.36 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. ఆపై బాధితుడు పలుమార్లు సంప్రదించినా స్కామర్లు అందుబాటులో లేకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :