తంజావూర్ : తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్లో దారుణ ఘటన జరిగింది. వార్డెన్ దాష్టీకంతో మనస్థాపానికి గురైన 12వ తరగతి విద్యార్ధిని (17) అర్ధంతరంగా తనువు చాలించింది. గదులను శుభ్రం చేయాలని వార్డెన్ బాలికపై ఒత్తిడి పెంచడంతో ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుంది.
వార్డెన్ తీరుతో విషం సేవించిన బాలిక బలవన్మరణానికి పాల్పడింది. విద్యార్ధుల వసతి గృహంలో గదులన్నీ శుభ్రం చేయాలని బాలికను వార్డెన్ కోరడంతో ఆమె విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. జనవరి 9న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికను చికిత్స నిమిత్తం తంజావూర్ ప్రభుత్వ బోధనాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.
తనను గదులన్నీ శుభ్రం చేయాలని వార్డెన్ సగయమేరీ వేధించడంతోనే తాను బలవన్మరణానికి పూనుకున్నానని బాలిక చెప్పడంతో ఆమె స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. వార్డెన్ సగయమేరీపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆమెను జైలుకు తరలించారు.