కోల్కతా : పశ్చిమ బెంగాల్లో దారుణం జరిగింది. లైంగిక వేధింపుల ఫిర్యాదును వెనక్కితీసుకోవాలని బెదిరింపులు రావడంతో మైనర్ బాలిక తనకు తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మయనగురి ప్రాంతంలో వెలుగుచూసింది. మయనగురి స్ధానిక టీఎంసీ నేత సోదరుడు బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఫిబ్రవరి 28న బాలిక ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో నిందితుడు లైంగిక వేధింపులకు గురిచేశాడు. బాలిక ప్రతిఘటించి సాయం కోసం అరవడంతో నిందితుడు పారిపోయాడు.
ఆపై బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు ఆపై బెయిల్పై విడుదలయ్యాడు. ఏప్రిల్ 13న ముఖానికి ముసుగులు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటికి వచ్చి బెదిరించారు. లైంగిక వేధింపుల కేసు వెనక్కితీసుకోకుంటే లైంగిక దాడికి పాల్పడటంతో పాటు కుటుంబ సభ్యులను చంపేస్తామని హెచ్చరించారు.
భయాందోళనకు లోనైన బాలిక మరుసటి రోజు తనకు తాను నిప్పంటించుకుంది. బాలికను కాపాడిన కుటుంబసభ్యులు జల్పాయిగురి ఆస్పత్రికి తరలించగా ఆపై అత్యవసర చికిత్స కోసం నార్త్ బెంగాల్ బోధనాసుపత్రికి తరలించారు. కొద్దిరోజులుగా చికిత్స పొందిన బాలిక సోమవారం మరణించింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, తక్షణమే అరెస్ట్ చేసి జైలుకు తరలించాలని బాలిక తండ్రి డిమాండ్ చేశారు. నిష్పాక్షిక విచారణ కోసం కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు.