న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. తాము పెండ్లి చేసుకునేందుకు అడ్డుగా ఉందనే కోపంతో ప్రియుడి (55)తో కలిసి మూడేండ్ల మనవరాలిని స్వయానా నానమ్మ (50) హత్య చేయించడం కలకలం రేపింది. డిసెంబర్ 25న బాలిక అదృశ్యం కాగా డిసెంబర్ 28న ఇల్హబస్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న భవనంలో చిన్నారి మృతదేహాన్ని నోయిడా పోలీసులు గుర్తించారు. బాలిక హత్యాచారానికి గురైందని పోలీసులు తెలిపారు.
గత రెండేండ్లుగా ఓ కేసుకు సంబంధించి తండ్రి జైలులో ఉండగా తల్లి బదౌన్ జిల్లాలో వేరుగా ఉంటుండటంతో బాలిక నానమ్మ దగ్గరే పెరుగుతోంది. దర్యాప్తులో భాగంగా పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా మహిళ నేరాన్ని అంగీకరించింది. తమ పెండ్లికి అడ్డుగా ఉన్న బాలికను హత్య చేయాలని నిర్ణయించుకున్నామని మహిళ తెలిపింది.
బులంద్షహర్ జిల్లాకు చెందిన వ్యక్తితో మహిళకు వివాహేతర సంబంధం ఉందని నేరస్వభావం కలిగిన అతడు మహిళతో కలిసి బాలికపై హత్యాచారానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు.