చండీఘర్ : హర్యానాలో నిర్వహించిన గణేశ్ నిమజ్జన వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. గణనాథుడిని నిమజ్జనం చేస్తుండగా.. ఏడుగురు వ్యక్తులు నీటిలో మునిగి చనిపోయారు. సోనిపట్లో ముగ్గురు చనిపోగా, మరో నలుగురు మహేంద్రగర్హ్లో మృతి చెందారు.
సోనిపట్లోని మిమార్పూర్ ఘాట్ వద్ద వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ఓ వ్యక్తి తన కుమారుడు, అల్లుడితో కలిసి వచ్చాడు. ఇక గణనాథుడిని నిమజ్జనం చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఈ ముగ్గురు నీటిలో మునిగి చనిపోయారు. మృతదేహాలను పోలీసులు బయటకు వెలికితీశారు.
ఇక మహేంద్రగర్హ్కు సమీపంలోని ఓ కెనాల్లో గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు ఓ 9 మంది బయల్దేరారు. అక్కడ వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో.. నలుగురు వ్యక్తులు కొట్టుకుపోయారు. రాత్రే గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు.
ఈ రెండు ఘటనలపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇది హృదయ విదారక ఘటన అని సీఎం పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.