న్యూఢిల్లీ: భర్త వివాహేతర సంబంధాలను సహించని భార్య, అతడ్ని అంతం చేయాలని నిర్ణయించింది. కిల్లర్కు సుపారీ ఇచ్చి హత్య చేయించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. రంహోలా ప్రాంతంలోని హోలీ కాన్వెంట్ స్కూల్ సమీపంలో ఈ నెల 18న ఒక వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందించింది. దీంతో వెంటనే అక్కడకు వెళ్లి పరిశీలించారు. దొంగ ఇంట్లోకి చొరబడి దోపిడీకి యత్నించాడని, అడ్డుకునేందుకు ప్రయత్నించిన తన భర్త వీర్ బహదూర్ వర్మ (50) తలపై సుత్తితో కొట్టి చంపినట్లు భార్య చందర్ కాలా అలియాస్ చందా ఆరోపించింది. దీంతో హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా, మృతుడి భార్య చందాను పలు మార్లు ప్రశ్నించగా ఆమె అబద్ధం చెబుతోందని పోలీసులు అనుమానించారు. దీంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్తోపాటు ఆమె మొబైల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. ఆ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్, కాంట్రాక్ట్ కిల్లర్ జుమ్మన్ అలియాస్ జుమ్మా ఆ ఇంటి వద్ద సంచరించడాన్ని గమనించారు. చందా అతడితో పలు మార్లు మొబైల్ ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. దీంతో మృతుడి భార్య చందాను పోలీసులు గట్టిగా నిలదీయగా ఆమె నోరు విప్పింది.
వీర్ బహదూర్ వర్మకు చెందిన వస్త్ర దుకాణంలో తాను 14 ఏండ్ల కిందట పని చేసినట్లు చందా తెలిపింది. ఆ సమయంలో అతడు తనపై అసభ్య ప్రవర్తించేవాడని, తన ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో అడ్డు చెప్పలేకపోయినట్లు చెప్పింది. వీర్ బహదూర్ వర్మకు పెళ్లై పిల్లలు ఉన్నప్పటికీ తనను రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. మొదటి భార్యా పిల్లలతోనే తన భర్త ఎక్కువగా ఉండేవాడని చెప్పింది. అలాగే షాపులో పని చేసే పలువురు మహిళలతో వివాహేతర సంబంధం కలిగి ఉండటంతో పాటు మరో ఇద్దర్ని కూడా అతడు పెళ్లి చేసుకున్నట్లు ఆరోపించింది.
దీంతో షాపులో పని చేసే నర్గీస్ అనే మహిళతో గోడు చెప్పుకోగా, సోదరుడు జుమ్మా ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడని, సహాయం చేస్తాడని ఆమె చెప్పినట్లు చందా తెలిపింది. అయితే రక్త క్యాన్సర్తో నర్గీస్ చనిపోయినట్లు చెప్పింది. చివరకు భర్తను కడతేల్చాలని నిర్ణయించి జుమ్మాను కలిసి రూ.1.5 లక్షలు సుపారీ ఇచ్చినట్లు చందా వివరించింది. ఈ నెల 18న కావాలనే ఇంటి గేట్ తిరిచి ఉంచానని, లోనికి వచ్చిన జుమ్మా తన భర్త తలపై సుత్తితో కొట్టి హత్య చేశాడని, దోపీడీ జరిగినట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులకు వెల్లడించింది. దీంతో చందాతోపాటు కాంట్రాక్ట్ హంతకుడు జుమ్మాను పోలీసులు అరెస్ట్ చేశారు.