పెద్దపల్లి : గంజాయి సరఫరాదారులపై జిల్లాలోని సుల్తానాబాద్ పోలీసులు కొరడా ఝుళిపించారు. గంజాయిని పూర్తిస్థాయిలో నియంత్రించాలని రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా గంజాయి సరఫరా, విక్రయం, వినియోగంపై సుల్తానాబాద్ పోలీసులు దృష్టి సారించారు.
గంజాయి విక్రయ ప్రదేశాలను గుర్తించడంతో పాటు అనుమానితుల కదలికలపై డేగ కన్ను వేశారు. ఇందులో భాగంగా గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు మూడు కిలోల 300 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి వెల్లడించారు.
శుక్రవారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సుల్తానాబాద్ పట్టణంలోని సుల్తానాబాద్ క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం ఎస్ఐ ఉపేందర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానంగా సంచరిస్తున్న సుద్దాలకు చెందిన న్యాతరి వంశీని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా 300 గ్రాముల గంజాయి లభించిందన్నారు.
విచారణలో వంశీ ఇచ్చిన సమాచారం మేరకు వేముల చంద్రప్రకాష్,కల్వల రోహిత్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన దుర్గం సంజీవ్ను అరెస్ట్ చేశామని ఏసీపీ తెలిపారు. ఎవరైనా గంజాయి సరఫరా చేసినా వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.