ములుగు : అక్రమంగా పులి చర్మాన్ని విక్రయిస్తున్న నిందితులను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ. పాటిల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
మంగళవారం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పులిచర్మం విక్రయించేందుకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వస్తున్నారని సమాచారం మేరకు..వెంకటాపురం సీఐ శివ ప్రసాద్ వాజేడు మండలం జగన్నాధపురం గ్రామం జాతీయ రహదారి వై జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు.
ఐదుగురు వ్యక్తులు రెండు బైకుల మీద ఛత్తీస్గఢ్ నుంచి వస్తుండగా అనుమానం వచ్చి తనిఖీలు చేపట్టారు. సోదాల్లో వారి వద్ద ఒక సంచిలో పులిచర్మాన్ని గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు.
వారి వద్ద పులిచర్మాన్ని స్వాధీనం చేసుకొని పూనెం విగ్నేహి, చీర శీను, పోయెమ్ రమేష్, చింతల బాలకృష్ణ, పొది చంటి లను అరెస్టు చేశామన్నారు.
ఛత్తీస్గఢ్లో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి పులిచర్మాన్ని కొనుగోలు చేసి తెలంగాణలో విక్రయించేందుకు వచ్చినట్లు నిందితులు తెలిపారని పేర్కొన్నారు. సమావేశంలో డీఎఫ్ ఓ ప్రదీప్ కుమార్ శెట్టి, ములుగు, ఏటూరునాగారం ఏఎస్పీలు సుధీర్ రాంనాథ్ కేకన్, అశోక్ కుమార్ పాల్గొన్నారు.