హైదరాబాద్ : శామిర్పేటలో సోమవారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. తుపాకీతో బెదిరించి రూ.2లక్షలను గుర్తు తెలియని దొండగులు దోపిడీ చేశారు. మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. గ్రామంలోని వైన్స్ వద్దకు రాత్రి మాస్క్లు ధరించి వచ్చిన ముగ్గురు దుండగులు వచ్చారు. క్యాషియర్తో పాటు మరో ఇద్దరిపై కర్రలతో దాడి చేశారు. మద్యం దుకాణం సిబ్బంది తిరగబడడంతో తుపాకీతో దుండగులు కాల్పులు జరిపారు.
సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో తూటా షట్టర్కు తగిలింది. ఆ తర్వాత డబ్బులతో పరారవుతుండగా.. సిబ్బంది కేకలు వేశారు. నిందితులు పారిపోతూ గాల్లోకి కాల్పులు జరిపారు. దుకాణ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.