రాజ్కోట్ : భార్య ప్రవర్తనతో విసిగి వేసారిన వ్యక్తి జైలుకు వెళితే కనీసం తిండి దొరుకుతుందనే ఆశతో నేరానికి పాల్పడిన ఘటన గుజరాత్లో వెలుగుచూసింది. అయినదానికీ, కానిదానికీ భార్య లెక్చర్లు ఇస్తుండటంతో విసిగిన వ్యక్తి జైలుకు వెళ్లినా నయమనే ఆలోచనతో రాజ్కోట్లోని పోలీస్ చౌకికీ నిప్పంటించి చోద్యం చూశాడు. నిందితుడిని నగరంలోని జామ్నగర్ రోడ్డులోని బజ్రంగ్ వాడికి చెందిన దేవ్జీ చవ్దాగా గుర్తించారు.
దినసరి కూలీగా పనిచేసే దేవ్జీ ఆదివారం సాయంత్రం తన ఇంటి ఎదురుగా ఉన్న పోలీస్ చౌకీ వద్దకు వెళ్లి దానిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటలను గుర్తించిన స్ధానిక వ్యాపారులు అక్కడికి వెళ్లగా నిందితుడు ఘటనా ప్రాంతంలోనే నిల్చుని ఉన్నాడు. మంటలను అదుపు చేసిన వ్యాపారులు, స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడు పారిపోకుండా అక్కడే ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా షాకింగ్ వివరాలు వెల్లడయ్యాయి. పోలీస్ చౌకీకి నిప్పంటించిన సమయంలో అది మూసివేసి ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
crime news latest news telugu news telangana news