హర్యానా : ఓ లంచగొండి ఎస్ఐ విజిలెన్స్ అధికారుల నుంచి తప్పించుకునేందుకు.. లంచం డబ్బును నోట్లో వేసుకుని మింగే ప్రయత్నం చేశాడు. కానీ విజిలెన్స్ అధికారులు మాత్రం ఆ నోట్లను బయటకు తీసేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఈ ఘటన హర్యానాలోని ఫరీదాబాద్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. శుభనాథ్ అనే వృద్ధుడి బర్రెను కొద్ది రోజుల క్రితం అపహరించారు. అయితే బర్రెను అపహరించిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు శుభనాథ్ ఫిర్యాదు చేశాడు. కానీ ఎస్ఐ మహేంద్ర ఉలా నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు. రూ. 10 వేలు లంచం ఇస్తేనే కేసు నమోదు చేసి, నిందితుడిపై చర్యలు తీసుకుంటానని శుభనాథ్కు ఎస్ఐ తేల్చిచెప్పాడు. దీంతో శుభనాథ్ ఇప్పటికే రూ. 6 వేలు లంచం ఇచ్చాడు. మరో రూ. 4 వేలు ఎస్ఐకి ఇవ్వాల్సి ఉంది. దీంతో కేసు నమోదు చేయకపోవడంతో ఎస్ఐపై విజిలెన్స్ అధికారులకు శుభనాథ్ ఫిర్యాదు చేశాడు.
ఇవాళ మిగిలిన రూ. 4 వేలు ఇస్తున్నట్లు విజిలెన్స్ అధికారులకు బాధితుడు సమాచారం అందించాడు. శుభనాథ్ నుంచి లంచం తీసుకుంటుండగా ఎస్ఐని విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెండ్గా పట్టుకున్నారు. దీంతో అధికారులకు చిక్కొద్దనే ఉద్దేశంతో ఆ కరెన్సీ నోట్లను ఎస్ఐ తన నోట్లో వేసుకుని మింగే ప్రయత్నం చేశాడు. ఓ అధికారి ఆ ఎస్ఐ నోట్లో వేలుపెట్టి నోట్లను బయటకు తీసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అధికారులకు, ఎస్ఐకి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. ఈ గొడవ జరుగుతన్న సమయంలో మరో వ్యక్తి అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అతన్ని అధికారులు నెట్టేశారు. ఇక లంచం కోసం ఇబ్బంది పెట్టిన ఎస్ఐని శుభనాత్ చెంపపై గట్టిగా వాయించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
A police sub-inspector in #Faridabad, #Haryana swallowed currency notes, to avoid being trapped by the vigilance team. Reportedly, the cop took a bribe from a person in exchange for initiating action on his complaint of buffalo theft.#SubInspector #MahenderPal #ViralVideo pic.twitter.com/oK3ZIIP2r3
— Hate Detector 🔍 (@HateDetectors) December 13, 2022