అహ్మదాబాద్ : ఏడాది పాటు సన్నిహితంగా మెలిగిన గర్ల్ఫ్రెండ్ బ్రేకప్ చెప్పడంతో ఆగ్రహంతో రగిలిన యువకుడు మరో ఇద్దరు మైనర్ స్నేహితులతో కలిసి యువతి (19)ని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనలో నిందితులను గుజరాత్లోని దహోద్లో పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధిత యువతి క్రుతిక బరంద సోమవారం ఉదయం ట్యూషన్ క్లాసులకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఆమె ద్విచక్రవాహనం కూడా కనిపించలేదు. అయితే మంగళవారం మధ్యాహ్నం భన్పూర్ అటవీప్రాంతంలో ముఖం కాలిన స్ధితిలో యువతి మృతదేహం లభ్యం కాగా ఇది తమ కూతురిదేనని బాధితురాలి తండ్రి గుర్తించారు.
వందారియా గ్రామానికి చెందిన మెహుల్ పర్మార్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో బాధితురాలి స్కూటర్ లభ్యమైంది. స్కూటర్ను పర్మార్ ఓ గ్యారేజ్లో వదిలివెళ్లాడు. పర్మార్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని ప్రశ్నించడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. పర్మార్, కృతిక ఏడాదిగా రిలేషన్షిప్లో ఉండగా ఇటీవల కృతిక అతడికి దూరంగా ఉంటోంది.
బ్రేకప్ను భరించలేని పర్మార్ ఇద్దరు బాలుర సహకారంతో ఆమెను అంతమొందించాలని ప్లాన్ వేశాడు. బంగ్లా ఫారెస్ట్కు రావాలని కృతికను పిలిపించిన పర్మార్ ఆపై ఆమెను కత్తితో పొడిచి ఊపిరిఆడకుండా చేసి హత్య చేశాడు. కత్తితో పాటు ఆమెకు చెందిన వస్తువులను చెరువులో పడేశాడు. మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ముఖాన్ని దగ్ధం చేశాడు. పోలీసులు పర్మార్ సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.