హైదరాబాద్ : కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో రెండు ఎలక్ట్రిక్ బైక్లు పేలి, మంటలు చెలరేగాయి. ఇంటి బయట చార్జింగ్ పెట్టిన సమయంలో బైక్ల బ్యాటరీలు పేలిపోయాయి. బ్యాటరీలో పేలుడు సంభవించడంతో పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు మంటలు అంటుకున్నాయి. బ్యాటరీలు పేలిన సమయంలో ఇంటి బయట ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల వనస్థలీపురంలోనూ ఎలక్ట్రిక్ బైక్కు చార్జింగ్ పెడుతున్న సమయంలో పేలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఎన్జీవోస్ కాలనీలో నివాసం ఉంటే కోటేశ్వర్రావు (33) అనే వ్యక్తి ఓ కంపెనీ నుంచి కొనుగోలు చేసిన దిచక్ర వాహనానికి ఇంట్లో చార్జింగ్ పెట్టాడు. అయితే.. చార్జింగ్ను చెక్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో మంటలు బ్యాటరీ పేలింది. కోటేశ్వరశ్రావుకు ముఖం, చేతులు, ఛాతికి మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి, మంటలను ఆర్పివేశారు.