న్యూఢిల్లీ : ఎంఎల్ఎం స్కామ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్వే ఇండియా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన రూ 757.77 కోట్ల విలువైన ఆస్తులను మనీల్యాండరింగ్ కేసులో ఈడీ అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ప్లాంట్, యంత్రాలు, వాహనాలు, బ్యాంక్ ఖాతాలు, పిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి.
రూ 757.77 కోట్లలో స్దిర, చరాస్తుల విలువ రూ 411.83 కోట్లు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆమ్వేకు చెందిన 36 బ్యాంకు ఖాతాల్లో రూ 345.94 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ ఉంది. 2002-03 నుంచి 2021-22 వరకూ ఆమ్వే తన వాణిజ్య కార్యకలాపాల ద్వారా రూ 27,562 కోట్లు సేకరించగా డిస్ట్రిబ్యూటర్లు, సభ్యులకు రూ 7588 కోట్ల కమీషన్ చెల్లించింది.
మార్కెట్లో ప్రముఖ బ్రాండ్లతో పోలిస్తే ఆమ్వే ఉత్పత్తుల ధరలు చాలా అధికంగా ఉన్నాయని ఈడీ పేర్కొంది. డైరెక్ట్ సెల్లింగ్ మల్లీ లెవెల్ మార్కెటింగ్ నెట్వర్క్ పేరుతో ఆమ్వే అక్రమాలకు పాల్పడిందని ఆరోపించింది. వాస్తవాలు తెలియని సాధారణ ప్రజలు కంపెనీలో సభ్యులుగా చేరి అత్యధిక ధరలు చెల్లించి ఉత్పత్తులు కొనడంతో వారి కష్టార్జితం కోల్పోతున్నారని ఈడీ ఓ ప్రకటనలో పేర్కొంది.