లక్నో : యూపీలోని ఖుషీనగర్లో దారుణం జరిగింది. మద్యానికి బానిసై అప్పుల ఊబిలో కూరుకుపోయిన వ్యక్తి తన భార్యతో పాటు ముగ్గురు పిల్లల గొంతుకోసి అంతమొందించడంతో పాటు తాను విషం సేవించాడు. నిందితుడిని తాపీ పనిచేసే జితేంద్ర కుష్వాహగా గుర్తించారు. ఈ ఘటనతో కుద్వా గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. నిందితుడు భార్య సహా నాలుగు నుంచి 8 సంవత్సరాలలోపు చిన్నారులను కర్కశంగా చంపడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
విషం సేవించిన జితేంద్రను గోరఖ్పూర్ మెడికల్ కాలేజ్కు తరలించగా అతడి పరిస్ధితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మద్యానికి బానిసైన జితేంద్ర భార్య లీలావతి (31), పిల్లలు ఆకాష్(8), వికాస్ (6) నిఖిల్ (4)లను పొట్టనపెట్టుకున్నాడని బంధువులు, స్ధానికులు విలపించారు. అప్పుల బాధతో పాటు మద్యానికి బానిసైన జితేంద్రను అత్తింటి వారు మందలించడంతోనే ఈ దారుణానికి ఒడిగట్టాడని చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.