భోపాల్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హుకుం సింగ్ కరద కుమారుడు రోహితబ్ సింగ్ తాగిన మైకంలో ఓ వ్యాపారి కారును తన వాహనంతో ఢీకొట్టిన ఘటన మధ్యప్రదేశ్లోని సెహోర్లో వెలుగుచూసింది. రోహితబ్ సింగ్ వ్యాపారి దినేష్ అహుజా కారును ఢీకొనడంతో పాటు ఆయనతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనను వ్యాపారి వీడియో తీయగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కారుకు నష్టం వాటిల్లడంతో పరిహారం కింద వ్యాపారి డబ్బు అడగడంతో రోహితబ్ సింగ్ దురుసుగా ప్రవర్తించాడు. మీతో తాను పోరాడతానని, పోలీస్ స్టేషన్కు రావాలని నిందితుడు అనడం వినిపించింది. ఆపై నిందితుడు మరో కారును ఢీ కొట్టాడు. నిందితుడు కత్తితో తన వెంట పరుగెడుతూ తన కారు విండోను బద్దలుకొట్టాడని వ్యాపారి ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.