Drugs | రంగారెడ్డి : షాద్నగర్ పరిధిలోని మోకిల వద్ద డ్రగ్స్ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ ముఠా నుంచి 51 గ్రాముల కొకైన్, 44 గ్రాముల ఎక్స్టాసీ పిల్స్, 8 గ్రాముల ఎండీఎంఏను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద ఐదు మొబైల్స్, మూడు కార్లు, రూ. 97,500 నగదను సీజ్ చేశారు.
అరెస్టు అయిన వారిలో లింగంపల్లి అనురాధ(34), సానికొమ్ము ప్రభాకర్ రెడ్డి(38), వెంకట శివసాయి కుమార్(33) ఉన్నారు. మంచిర్యాలకు చెందిన అనురాధ గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు. గోవా నుంచి ఓ వ్యక్తి డ్రగ్స్ తీసుకొచ్చి, అనురాధకు విక్రయిస్తున్నాడు. గచ్చిబౌలి డీఎల్ఎఫ్ వద్ద టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న ప్రభాకర్ రెడ్డి ద్వారా తన స్నేహితులకు అనురాధ డ్రగ్స్ సరఫరా చేస్తోంది.
ఈ బిజినెస్ లాభాలు తెచ్చిపెడుతుండటంతో.. ప్రభాకర్ రెడ్డి, అనురాధ కలిసి డ్రగ్స్ వ్యాపారాన్ని మరింత విస్తరించారు. గోవా నుంచి రెగ్యులర్గా డ్రగ్స్ తెప్పించి, ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇక సాయి కుమార్ కూడా అనురాథ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి.. ఇతరులకు అమ్ముతున్నాడు. వీరంతా కలిసి డ్రగ్స్ దందా చేస్తున్నారని, ఓఆర్ఆర్ మోకిల వద్ద ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని అనురాధ, ప్రభాకర్ రెడ్డి, సాయికుమార్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.