పుణే : ఇంటి యజమాని భార్యతో పాటు పిల్లలకు మత్తుమందు ఇచ్చి రూ 1.5 లక్షల విలువైన నగదు, విలువైన వస్తువులతో ఉడాయించిన పనిమనుషులపై పుణే పోలీసులు కేసు నమోదు చేశారు. విదేశాల్లో నివసించే యజమాని మంగళవారం ఉదయం తన భార్య, పిల్లలకు పోన్ చేసినా స్పందించకపోవడంతో ఆ ప్రాంతంలోనే ఉండే తన బావమరిదితో పాటు కాంప్లెక్స్లో సెక్యూరిటీ గార్డును అప్రమత్తం చేశాడు.
బావమరిది అక్కడికి చేరుకోగా ఆయనకు తన సోదరితో పాటు మేనల్లుడు స్ప్రహ లేకుండా కనిపించారు. దీంతో తక్షణమే అతడు అంబులెన్స్కు కాల్ చేసి వారిని దవాఖానకు తరలించి పోలీసులకు సమాచారం అందించాడు. బాధితులు కోలుకోగానే వారి నుంచి చోరీకి సంబంధించి పూర్తి వివరాలు రాబడతామని పోలీసులు తెలిపారు. అదే ఇంట్లో పనిచేసే భార్యాభర్తలే ఈ దారుణానికి ఒడిగట్టారని చెప్పారు.
నేపాల్కు చెందిన ఈ దంపతులు ఎరుపు రంగు బ్యాగ్తో వెళ్లడం చూశానని సొసైటీ సెక్యూరిటీ గార్డు తెలిపాడు. ఇంటి పనులు చేసే వీరు అదే బంగ్లాలోని క్వార్టర్లో ఉంటారని చెప్పాడు. పోలీసులు క్వార్టర్కు వెళ్లి చూడగా నిందితులు అప్పటికే పరారయ్యారు.