పూణే: పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఒక ప్రైవేటు సెక్యూరిటీ గార్డు అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. బస్ డిపోలో ఉన్న నగరపాలక సంస్థకు చెందిన బస్సులో నుంచి డీజిల్ చోరీ చేశాడు.
ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో వెలుగు చూసింది. గణేష్ ధంగర్ (25) అనే వ్యక్తి బిబ్వేవాడి ప్రాంతంలో నివసిస్తుంటాడు. ఇక్కడి బస్ డిపోలో ఆగి ఉన్న పూణే మహనగర్ పరివాహాన్ మహామండల్ లిమిటెడ్ (పీఎంపీఎల్) బస్సు నుంచి అతను డీజిల్ చోరీ చేశాడు.
దీనిపై ఆ బస్సు డిపో వార్డ్ ఇన్స్పెక్టర్ అవినాష్ సోనోవనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అర్ధరాత్రి 3.30 గంటలకు బస్ డిపోకు చేరుకున్న గణేష్.. బస్సు ట్యాంకు నుంచి అతను 5 లీటర్ల డీజిల్ను దొంగిలించి దాన్ని ఒక డబ్బాలో తీసుకెళ్లే ప్రయత్నం చేశాడని అవినాష్ ఫిర్యాదు చేశాడు.
ఈ డీజిల్ విలువ రూ.500 ఉంటుందని అతను పేర్కొన్నాడు. దీంతో గణేష్పై ఐపీసీ సెక్షన్ 381 కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.