న్యూఢిల్లీ : సోషల్ మీడియా వేదికలపై పరిచయం పెంచుకుని ఆపై మార్ఫింగ్ చేసిన నగ్న, అభ్యంతరకర చిత్రాలు పంపి డబ్బు గుంజుతున్న ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. రాజస్ధాన్కు చెందిన ఈ ముఠా సభ్యుడిని ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు మిగిలిన ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితుడికి ఫేస్బుక్లో ఓ వ్యక్తి నుంచి యువతి పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. రిక్వెస్ట్ను అంగీకరించగానే నిందితుడు అతడి వాట్సాప్ నెంబర్ను కోరాడు. ఆపై కొద్దిరోజులకు నిందితుడి నుంచి అభ్యంతరకర కంటెంట్తో బాధితుడికి వీడియో కాల్ వచ్చింది. తర్వాత అభ్యంతరకర కంటెంట్లో బాధితుడి మార్ఫ్డ్ వీడియోను పంపిన నిందితుడు డబ్బు కోసం బెదిరింపులకు దిగాడు.
ఈ వీడియోను ఇంటర్నెట్లో అప్లోడ్ చేయకుండా ఉండాలంటే రూ 1,96,000 చెల్లించాలని కోరగా బాధితుడు భయంతో ఆ మొత్తం సమర్పించుకున్నాడు. ఆపై బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు రాకెట్ గుట్టు రట్టు చేసి ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఫిర్యాదుదారుకు కాల్ చేసేందుకు ఉపయోగించిన నెంబర్లు అస్సాంకు చెందినవిగా, వాటిని రాజస్ధాన్లోని భరత్పూర్ జిల్లా నుంచి వాడినట్టు గుర్తించారు. నిందితుడు హక్ముద్దీన్ను అరెస్ట్ చేసిన పోలీసులు మిగిలిన ముగ్గురు అనుమానితుల కోసం గాలిస్తున్నారు. వీరు ఫేస్బుక్ సహా సోషల్ మీడియా వేదికల్లో యువతుల పేరుతో పరిచయం పెంచుకుని బాధితులను నిండా ముంచడం పనిగా పెట్టుకున్నారని పోలీసులు వెల్లడించారు.