15 రోజుల క్రితం చనిపోయిన ఒక మహిళ మృతదేహానికి అంతక్రియలు జరిగాయి. కానీ ఆ మహిళ తాను బతికే ఉన్నానంటూ ఇప్పుడు తిరిగొచ్చింది. దీనికి వెనుక ఉన్న రహస్యం ఏమిటోనని ఆమె కుటుంబ సభ్యులు, పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ సంఘటన రాజస్థాన్లోని హనుమాన్గడ్ జిల్లాలో జరిగింది.
హనుమాన్గడ్ జిల్లా పరిధిలోని జోగివాలా గ్రామంలో నివసించే పరంజీత్ కౌర్ అనే మహిళ నవంబర్ 15 నుంచి కనబడకుండా పోయింది. ఆమె తన భర్తతో గత కొన్ని రోజులుగా గొడవ పడుతుండడంతో.. ఆమె భర్త నవంబర్ 17న పరంజీత్ ఎక్కడికో పారిపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పరంజీత్ ఇంట్లోని నగలు, డబ్బు కూడా తీసుకువెళ్లినట్లు ఆమె భర్త చెప్పాడు.
పోలీసులు పరంజీత్ తల్లిదండ్రులను పిలిపించగా.. వారు కూడా ఆమె తమ వద్దకు రాలేదని చెప్పారు. దీంతో పోలీసులు ఆమెపై దొంగతనం, చీటింగ్ కేసు నమోదు చేశారు. కానీ నవంబర్ 21న పోలీసులకు ఒక శవం దొరికింది. ఆ శవం ముఖానికి బాగా దెబ్బలు తగలి ఉన్నాయి. అనాథ శవంగా భావించిన పోలీసులు మిస్సింగ్ కేసులను రిపోర్ట్ చేసిన కుటుంబ సభ్యులను పిలిచారు. ఈ క్రమంలో పరంజీత్ భర్త, తల్లిదండ్రులను కూడా పిలిచారు. వారంతా ఆ శవం పరంజీత్ లాగానే ఉందనడంతో.. ఆ మృతదేహాన్ని వారికి అప్పగించారు.
నవంబర్ 22న పరంజీత్ మృతదేహానికి అంతక్రియలు జరిగాయి. కానీ పరంజీత్ డిసెంబర్ 7న తన భర్త ఇంటికి తిరిగొచ్చింది. దీంతో ఆమె భర్త ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఆమె తన భార్య కాదని… ఏదో భూతమని బయటికి పొమ్మన్నాడు. తను లేని సమయంలో ఏం జరిగిందో తెలుసుకున్న పరంజీత్.. వెంటనే పోలీస్ స్టేషన్ చేరుకొని తాను బతికే ఉన్నానని చెప్పింది.
పోలీసులు ముందుగా ఆమెను.. ఇంతకాలం ఎక్కడున్నావని? అడిగారు. తాను భర్తతో గొడవపడి హర్యానాలోని తన స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది. పోలీసులు ఆమె చెప్పిన విషయం.. హర్యానా ఫోన్ చేసి ధృవీకరించుకున్నారు. కానీ పరంజీత్పై ఆమె భర్త చేసిన నగల దొంగతనం ఫిర్యాదుపై అరెస్టు చేశారు.
ఇదంతా.. బాగుంది కానీ ఆ అంతక్రియలు జరిగిన మృతదేహం ఎవరిదో ఇంతవరకు పోలీసులు తేల్చలేకపోయారు. ప్రస్తుతం ఆ మృతదేహం అస్తికల డిఎన్ఏ ఆధారంగా గుర్తుపట్టాలని పోలీసులు విచారణ చేస్తున్నారు.