హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్18(నమస్తే తెలంగాణ): నకిలీ పత్రాలతో రియల్ఎస్టేట్ వ్యాపారిని రూ.8.5 కోట్లకు మోసం చేసిన ఘరానా ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టుచేశారు. మహేశ్వరం మండలం గొల్లూరు లోని సర్వేనంబర్ 137, 141, 140, 100, 138 పార్ట్, 100 పార్ట్లోని 40 ఎకరాల పొలానికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అమీర్పేటకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఈ ముఠా మోసపూరితంగా విక్రయించేందుకు ఒప్పందం చేసుకొంది. అతడి నుంచి రూ.8.5 కోట్లు అడ్వాన్స్గా తీసుకొని మోసం చేయటంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దాంతో ప్రధాన నిందితుడు పిడుగు ఆదినారాయణమూర్తితోపాటు అతడి గ్యాంగ్ను అరెస్టు చేసినట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ శుక్రవారం మీడియాకు తెలిపారు. నిందితుడు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందినవాడని, హైదరాబాద్లో స్థిరపడ్డట్టు ఆయన వెల్లడించారు. ముఠా నుంచి పేర్లు, ఫొటోలతో ఉన్న 51 పట్టాదారు పాస్ పుస్తకాలు, 91 డాక్యుమెంట్లు, వివిధ మండలాలలకు చెందిన 9 రెవెన్యూ స్టాంప్లు, 294 స్టాంప్పేపర్లు, ఐదు ఆరోగ్యశ్రీ హెల్త్కార్డులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొన్నట్టు చెప్పారు. ఆస్తులు కొనేవాళ్లు తప్పనిసరిగా సబ్రిజిస్ట్రార్, ఎమ్మార్వో కార్యాలయాలకు వెళ్లి అసలైన యజమాని ఎవరో నిర్ధారించుకున్న తరువాతే ముందడుగు వేయాలని సీపీ సూచించారు. ఎవరైనా మోసం చేస్తే డయల్ 100, సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగానికి, 94936 25553 నంబర్కు వాట్సప్ చేయాలని సీపీ సజ్జనార్ కోరారు.