లక్నో : యూపీలో దారుణం వెలుగుచూసింది. యూనిఫాం ధరించలేదని గ్రామ మాజీ సర్పంచ్ దళిత బాలికను తీవ్రంగా కొట్టి స్కూల్ నుంచి గెంటేసిన ఘటన భదోది జిల్లాలో జరిగింది. నిందితుడిని గ్రామ మాజీ సర్పంచ్ మనోజ్ కుమార్ దూబేగా గుర్తించామని పోలీసులు తెలిపారు.
ఉపాధ్యాయుడు, అధికారి కూడా కానటువంటి నిందితుడు రోజూ స్కూల్కు వెళ్లి చిన్నారులు, ఉపాధ్యాయుల పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడని తెలిసిందని చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రోజూలాగే స్కూల్కు వెళ్లిన దూబే ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్ధినిని యూనిఫాం ఎందుకు వేసుకురాలేదని ప్రశ్నించాడు.
తనకు యూనిఫాం లేదని..తండ్రి తనకు కొనిచ్చినప్పుడు వేసుకుంటానని బాలిక బదులిచ్చింది. దీంతో ఆగ్రహానికి లోనైన నిందితుడు దూబే క్లాస్రూంలో బాలికను తీవ్రంగా కొట్టి, కులం పేరుతో దూషిస్తూ స్కూల్ నుంచి బయటకు పంపాడు. బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేశామని త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.