జడ్చర్ల: ‘మీ నంబరుకు రూ. 25 లక్షలు లాటరీ తగిలింది..మీ ఫోన్కు లింక్ మేసేజ్ వస్తుంది..మీరు క్లిక్ చేయండి’ అని ఓ మహిళకు అపరిచితుడిని నుంచి ఫోన్ వచ్చింది. ‘ఎవరికి చెప్పొద్దు…ఎవరికైనా చెబితే డబ్బులు రావు అని ఆన్లైన్ మోసగాడు చెప్పుకొచ్చాడు. రూ.25 లక్షలు మీ బ్యాంకు అకౌంట్ లో పడాలంటే కొంత టాక్స్ చెలించాలి’ అని నమ్మబలికాడు. దీన్ని నమ్మిన ఓ అమయకురాలు ఆన్లైన్ మోసగాడి ఫోన్పే కు రూ. 64 వేలు చెల్లించి మోసపోయిన ఘటన జడ్చర్లలో వెలుగులోకి వచ్చింది.
జడ్చర్ల సీఐ రమేశ్బాబు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జడ్చర్ల లోని నిమ్మబావిగడ్డ ప్రాంతానికి చెందిన సనా బేగం అనే మహిళకు ఈ నెల 17న ఓ అపరిచుతుడి నుంచి ఫోన్ వచ్చింది. రూ. 25 లక్షల లాటరీ వచ్చింది..కొంత ట్యాక్స్ చెల్లిస్తే మీ అకౌంట్లో డబ్బులు వేస్తామని నమ్మబలికారు. మోసగాడి మాటలను నమ్మిన బాధితురాలు విడతల వారీగా అతని ఫోన్ పే నంబరు కు దాదాపు రూ. 64 వేలు వరకు డబ్బులు పంపింది. మళ్లీ డబ్బులు పంపాలని అపరిచితుడు నుంచి ఫోన్లు రావడంతో అనుమానం వచ్చి బాధితురాలు గురువారం జడ్చర్ల పోలీసులను ఆశ్రయించింది. వెంటనే పోలీసులు స్పందించి సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి అకౌంట్ నుంచి డబ్బులు వెళ్లకుండా ఆపేశారు. కానీ బాధితురాలి అకౌంట్ నుంచి అప్పటికే రూ. 64 వేలు మోసగాడి చేతిలోకి వెళ్లిపోయాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.