జైపూర్: బంగారం అక్రమ రవాణా ప్రయత్నం బెడిసి కొట్టింది. షేవింగ్ చేసుకునే ట్రిమ్మర్లో దాచిన గోల్డ్ బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రాజస్థాన్లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఈ ఘటన జరిగింది. షార్జా నుండి వచ్చిన ఒక ప్రయాణికుడిపై అనుమానం వ్యక్తమైంది. దీంతో కస్టమ్స్ అధికారులు ఆ వ్యక్తిని అడ్డుకుని అతడి లగేజ్ను తనిఖీ చేశారు. షేవింగ్ ట్రిమ్మర్లలో ఐదు గోల్డ్ బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారు బిస్కెట్ల విలువ రూ.24 లక్షలకుపైగా ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.