మోమిన్పేట : అనుమానాస్పద స్థితిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన మోమిన్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంటేశం తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్ మండలం ఉద్దండపూర్ గ్రామానికి చెందిన సుభాశ్, మంజుల దంపతులు వారం రోజుల క్రితం మండల పరిధిలోని మక్తతాండలోని ఓ కోళ్లఫారంలో పని చేసేందుకు వచ్చారు. ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు మీనాక్షి, మైత్రి (3), మహేశ్వరి (15 నెలల), శుక్రవారం రాత్రి పెరుగుతో భోజనం చేసి పడుకోగా ఉదయం లేచి చూసేసరికి ఇద్దరి పిల్లలు మైత్రి, మహేశ్వరితో పాటు భార్య మంజుల అపస్మారక స్థితిలో పడి ఉన్నారు.
గమనించిన భర్త కోళ్లపారం లీజ్ యాజమానికి సమాచారం అందిచాడు. లీజ్ తీసుకున్న వ్యక్తి బాబు పీఏసీఎస్ చైర్మన్ విష్నువర్ధన్రెడ్డికి సమాచారం అందించాడు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందిచారు. సమాచారం అందుకున్న మోమిన్పేట సీఐ వెంకటేశం సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని మృతి చెందిన చిన్నారులను, సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన చిన్నారులు మైత్రి, మహేశ్వరి మృతుదేహలను పోస్టుమార్టం నిమిత్తం మర్పల్లి ఆసుపత్రికి తరిలించగా, అపస్మారక స్థితిలో ఉన్న భార్య మంజులను చికిత్స నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఫుడ్ పైజనింగా లేక భోజనంలో మత్తు మందు కలిపి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై పూర్తి వివరాల కోసం తండ్రి సుభాష్ను పోలీసులు కస్టడిలోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు సీఐ తెలిపారు. అనంతరం వికారాబాద్ డీఎస్పీ సత్యనారాయణ మండల పోలీస్ స్టేషన్కు చేరుకుని చిన్నారుల మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.