‘పుష్ప’, ‘భావ్కాల్’ వంటి గ్యాంగ్స్టర్ సినిమాలు చూసిన కొందరు మైనర్ బాలురు.. పాపులర్ అవ్వడం కోసం అడ్డదార్లు తొక్కారు. దేశరాజధానిలో హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జహంగీర్పురి ప్రాంతంలో జరిగింది. మొత్తం ముగ్గురు బాలురు.. అటుగా వస్తున్న ఒక వ్యక్తిని అడ్డగించారు.
వారిలో ఒకడు మొబైల్లో వీడియో తీస్తుండగా.. మిగతా ఇద్దరూ బాధితుడిని తీవ్రంగా కొట్టారు. ఇలా ముగ్గురూ కలిసి అతన్ని తీవ్రంగా హింసించారు. ఆపై డాగర్ తీసుకొచ్చి పొడిచేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. గాయాలతో రోడ్డుపై పడి ఉన్న వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది.
అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తూ దర్యాప్తు చేశారు. ముగ్గురు మైనర్ నిందితులు కూడా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఒక ప్రాంతంలో ఉండకుండా, ఎప్పటికప్పుడు తాము ఉండే ప్రాంతాలు మారుస్తూ తిరిగారు.
అయితే గురువారం నాడు పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి హత్యోదంతాన్ని వీడియో తీసిన మొబైల్, హత్యకు ఉపయోగించిన డాగర్ స్వాధీనం చేసుకుననారు.