నోయిడా: ఒక వ్యక్తి ప్రాణం కాపాడటం కోసం పోలీసులు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. కేవలం మూడు నిమిషాల్లోనే 3 కిలోమీటర్లు ప్రయాణించి, ఇంట్లో ఉరికి వేలాడుతున్న వ్యక్తిని కాపాడారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివసించే ఒక వ్యక్తి భార్యతో గొడవ పడ్డాడు.
వాగ్వాదం అనంతరం ఆ భార్య పొలం పనికి వెళ్లిపోయింది. అనంతరం బాధతో మద్యంతాగిన భర్త ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. తండ్రి గదిలోకి వెళ్లి తలుపు వేసుకోవడం గమనించిన అతని కుమార్తె.. వెంటనే తన సోదరుడికి ఫోన్ చేసింది. పరిస్థితి అర్థం చేసుకున్న అతను వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించాడు.
ఆమె ఫోన్ చేయగానే స్పందించిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కిటికీలో నుంచి చూడగా ఉరికి వేలాడుతున్న వ్యక్తి కనిపించాడని, అయితే అతనిలో ఇంకా కొంచెం కదలిక ఉండటంతో తలుపులు బద్దలు కొట్టి ప్రాణాలు కాపాడామని పోలీసులు తెలిపారు. అనంతరం అతన్ని ఆసుపత్రికి తరలించారు.