ఇటీవల ఉద్యోగం కోల్పోయిన ఒక ఇంజనీరు దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఉన్న 76 ఏళ్ల తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటం, అప్పులు అతనికి సమస్యలుగా మారాయి. ఉద్యోగం కోల్పోవడంతో ఎలా బతకాలో తెలియలేదు. దీంతో భయంకరమైన నిర్ణయం తీసుకున్న అతను.. నిర్మల వివిధ అనారోగ్యాలకు వేసుకునే ట్యాబ్లెట్లు అన్నీ కలిపి తల్లికి తాపించాడు.
ఆపై ప్లాస్టిక్ కవర్ తీసుకొని తల్లి మొఖానికి చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆపై సూసైడ్ నోట్ రాసి, తమ బంధువులకు వాట్సాప్ చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో వెలుగుచూసింది. సదరు ఇంజనీరును గణేష్ ఫర్టాడేగా పోలీసులు గుర్తించారు.
గణేష్ పినతల్లి పూణేలోనే నివసిస్తోంది. శనివారం రాత్రి గణేష్ పంపిన మెసేజ్ను ఆదివారం ఉదయమే ఆమె చూసింది. వెంటనే ఇతర బంధువులకు సమాచారం ఇచ్చి, గణేష్ ఇంటికెళ్లి చూడాలని కోరింది. ఈ క్రమంలోనే పోలీసులకు కూడా ఈ సమాచారం అందింది.
వెంటనే గణేష్ ఇంటికి చేరుకున్న వాళ్లు.. తలుపులు బద్దలుకొట్టి లోపలకు వెళ్లారు. అక్కడ గణేష్ తల్లితోపాటు గణేష్ మృతదేహం వాళ్ల కంటపడింది. తల్లిని హతమార్చిన తర్వాత గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఉద్యోగం కోల్పోవడంతో బాగా డిప్రెషన్లో పడిపోయిన గణేష్ ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు.