స్థానికంగా ఒక ప్రముఖ పబ్ ముందు ఒక కారు ఆగి ఉంది. దాన్ని గురువారం కొందరు స్థానికులు చూశారు. ఆ మరుసటి రోజు కూడా ఆ కారు అక్కడే ఉండటం స్థానికులకు అనుమానం కలిగించింది. దీంతో అనుమానం తీర్చుకునేందుకు ఇద్దరు యువకులు వెళ్లి.. బలవంతంగా కారు తలుపులు తెరిచారు.
ఆ లోపల కనిపించిన దృశ్యం వారికి షాకిచ్చింది. ఎందుకంటే ఆ కారులో ఒక వ్యక్తి కదలిక లేకుండా కూర్చొని ఉన్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూనే ప్రాంతంలో వెలుగు చూసింది. ఇక్కడి బిజీ దారుల్లో ఒకటైన బానేర్ రోడ్డుపై ఆగిన నల్లకారులో మృతదేహం లభ్యమైంది.
ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీసీ కెమెరాలు పరిశీలించగా.. పబ్బులో ఫుల్లుగా మందుకొట్టి బయటకు వచ్చిన ఒక వ్యక్తి కనిపించాడు. ఏం చేస్తున్నాడో కూడా తెలియని మత్తులో నడిరోడ్డుపై మూత్ర విసర్జన చేశాడు. ఆ తర్వత తూలుతూ వెళ్లి కారులో కూర్చుకున్నాడు.
ఇక మళ్లీ బయటకు రాలేదు. కారులోనే ఊపిరందక అతను మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడిని మరుంజే హింజెవాడికి చెందిన అమోల్ సంభాజీ బింద్రరేగా గుర్తించినట్లు తెలిపారు. అయితే రాత్రిళ్లు పోలీసులు గస్తీ తిరుగుతున్నారని ఇటీవలే స్థానిక పోలీసు అధికారులు చెప్పారని, ఇలా కారులో డెడ్ బాడీ ఉన్న విషయాన్ని కూడా వారు గుర్తించలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రాత్రిపూట పోలీసుల పెట్రోలింగ్ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే సదరు కారు పార్కింగ్ లైన్లో ఉండటంతో గస్తీ తిరిగిన పోలీసులు పట్టించుకొని ఉండకపోవచ్చని అధికారులు సమాధానమిచ్చారు. అలాగే, 24 గంటల పాటు ఏదైనా వాహనం కదలకుండా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.