పోలీసు స్టేషన్ ముందు జరిగిన చిన్న యాక్సిడెంట్.. భయంకరమైన హత్య కేసును వెలుగులోకి తెచ్చింది. ఇదేదో సినిమా కథ కాదు. నిజంగానే జరిగింది. బెంగళూరు మహానగరంలో వెలుగు చూసిన ఈ వింత ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని ఆర్ఆర్ నగర్లో సౌమ్య అనే 21 ఏళ్ల అమ్మాయి నివశిస్తోంది.
అదే ప్రాంతంలో నివశించే రఘు (30), దుర్గ (28) దంపతుల దగ్గర ఆమె కొంత డబ్బు అప్పుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ డబ్బు గురించి సౌమ్యను ఆ దంపతులు నిలదీశారు. ఈ విషయంలో ముగ్గురికీ వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన రఘు.. సౌమ్యను లాగిపెట్టి కొట్టాడు. కింద పడిన సౌమ్య మళ్లీ లేవలేదు. ఆమె చనిపోయిందని అర్థం చేసుకున్న రఘు, దుర్గ దంపతులు.. వెంటనే ఆమె మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లిపోయి దాచేశారు.
సౌమ్య తల్లిదండ్రులు వచ్చి అడిగితే ఆమె ఎక్కడకు వెళ్లిందో తమకు తెలియదని చెప్పారు. అనంతరం నాగరాజ్ (18), వినోద్ (19) అనే ఇద్దరు కుర్రాళ్లను పిలిచారు. సౌమ్య మృతదేహాన్ని నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉండే చెన్నపట్నానికి తీసుకురావాలని వాళ్లిద్దరికీ చెప్పారు. వాళ్లకు ఎలాంటి ఆశ చూపారో తెలియదు కానీ.. కుర్రాళ్లిద్దరూ దానికి ఒప్పుకున్నారు. రఘు, దుర్గ ఒక బైక్ ఎక్కి చెన్నపట్నం వెళ్లిపోయారు.
అక్కడే సౌమ్య మృతదేహాన్ని తగలబెట్టేయాలని వాళ్లు ప్లాన్ చేశారు. అదే సమయంలో సౌమ్య మృతదేహాన్ని తీసుకొని మరో బైక్పై బయలుదేరిన నాగరాజ్, వినోద్ ఒక స్పీడ్ బ్రేకర్ను చూడకపోవడంతో.. వేగంగా వస్తూ కింద పడిపోయారు. ఇది సరిగ్గా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీసు ఎదురుగా జరిగింది. అర్ధరాత్రి కావడంతో అక్కడ పెద్దగా జనాలు లేరు. మిత్రులు కింద పడిపోవడం చూసిన పోలీసులు కంగారుగా వచ్చి.. దెబ్బలు తగిలిన వాళ్లను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ ముగ్గురినీ చెక్ చేసిన వైద్యులు.. సౌమ్య సుమారు 8 గంటల క్రితమే మరణించిందని వెల్లడించారు. దీంతో షాకైన పోలీసులు.. కుర్రాళ్లిద్దరినీ తమదైన స్టైల్లో విచారించారు. వాళ్లు తమకు తెలిసిన నిజమంతా చెప్పేశారు. వాళ్ల ఫోన్ నుంచే రఘుకు కాల్ చేసి, దంపతులు ఎక్కడ ఉన్నదీ తెలుసుకున్నారు. అక్కడకు చేరుకొని వాళ్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. అసలు ఆ దంపతుల నుంచి సౌమ్య డబ్బులు తీసుకుందా? లేదా? లేదంటే దొంగతనం చేసిందా? లేకపోతే ఆ దంపతులే అబద్ధాలు చెప్తున్నారా? అని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.