బొంరాస్ పేట : కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ వ్యక్తి అస్వస్థతకు గురై మృతి చెందిన సంఘటన మండలంలోని గట్టెనాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని నర్సయ్య నాయక్తండాలో చోటు చేసుకుంది. తండావాసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం తండాకు చెందిన ఆంగోత్ బీక్యానాయక్(46) భార్య సాలీబాయి, ముగ్గురు పిల్లలతో కలిసి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మేస్త్రీగా పనిచేస్తు కుటుంబాన్ని పోషించేవాడు. గత నెల 30వ తేదీన బీక్యానాయక్ సంగారెడ్డి పట్టణంలో కొవిడ్ రెండో డోసు వ్యాక్సిన్ తీసుకుని ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు జ్వరంతో బాధపడుతూ అకస్మాత్తుగా బీపీ పెరిగి కిందపడిపోయాడు.
కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. కొవిడ్ టీకా తీసుకోవడం వల్లనే బీక్యానాయక్ మృతిచెందాడని కుటుంబ సభ్యులు, తండా వాసులు ఆరోపిస్తున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి చనిపోవడంతో భార్యా, పిల్లలు అనాథలుగా మారారు. మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని తండా వాసులు, మండల టీఆర్ఎస్ నాయకుడు రాథోడ్ నర్సింహానాయక్ కోరారు.