కుల్కచర్ల : లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన డాపూర్ మండల పరిధిలోని కల్మన్కల్వా గ్రామంలో చోటుచేసుకున్నది. కల్మన్కల్వా గ్రామానికి చెందిన మారగోని చెన్నప్ప రోజు మాదిరిగానే తన పశువులను పొలం దగ్గర కట్టేసి వచ్చాడు. శుక్రవారం ఉదయం వెళ్లి చూడగా లేగదూడ కట్టేసిన కొద్ది దూరంలో రక్తపు మడుగులో ప్రేగులు బయటపడి ఉంది. ఘటనా స్థలంలో పరిశీలించి చూడగా పరిసర ప్రాంతంలో చిరుత నడిచిన అడుగులు స్పష్టంగా కనిపించాయి.
దీంతో చిరుత దాడి చేసిందని విశ్వసించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. లేగ దూడలపై ఆధారపడి బతికే తనను ఆదుకోవాలని బాధిత రైతు కోరడం జరిగింది.