మొయినాబాద్ : భార్యపై అనుమానం పెంచుకుని భార్యను హత్య చేసిన భర్తకు న్యాయస్థానం శుక్రవారం జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. మొయినాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన కుంచాల శ్రీనివాస్రావు, కుంచాల కోటేశ్వరమ్మలు బతుకుదెరువు కోసం 2016లో మొయినాబాద్ మండలానికి వలస వచ్చారు. నాటి నుంచి మండల పరిధిలోని నక్కలపల్లి గ్రామంలో అద్దెకు ఉంటూ జీవనం సాగించారు. అయితే శ్రీనివాస్రావు తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో 2019 నవంబర్ 17న అర్ధరాత్రి హత్య చేసి పరారయ్యడు. కోటేశ్వరమ్మ సోదరుడు ఏడు కొండలు శ్రీనివాస్రావుపై అనుమానంతో మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న శ్రీనివాస్రావును పోలీసులు 2019లో నవంబర్ 22న అరెస్టు చేసి విచారణ జరిపారు. అతను భార్యను హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో రిమాండ్కు తరలించారు. రిమాండ్కు తరలించిన 90రోజుల్లో పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
అతనికి బెయిల్ రాకుండ పోలీసులు కోర్టులో వాధించడంతో రెండు సంవత్సరాలు జైల్ జీవితం గడిపాడు. హత్య కేసులో 23మంది సాక్షులు ఉన్నారు. ఎల్బీనగర్లోని 14-సెషన్ కోర్టులో హత్యకు సంబంధించిన కేసు విచారణకు వచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు సాక్షులను పిలిచి విచారణ జరిపారు. 23 మంది సాక్షులు శ్రీనివాస్రావే హత్య చేసినట్లు వాంగ్మూలం ఇవ్వడంతో హత్య అతడే చేసినట్లుగా నిర్దారణ అయ్యింది. నేరం నిరూపణ కావడంతో ఎల్బీనగర్లోని 14-సెషన్ కోర్టు అదనపు న్యాయమూర్తి సుదర్శన్ భార్యను హత్య చేసిన భర్తకి జీవిత ఖైదీ విధిస్తూ తీర్పునిచ్చారు.