మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 10లక్షల విలువైన 102 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. శుక్రవారం మహబూబాబాద్ టౌన్ పోలీసు స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. వరంగల్ ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన షేక్ ఇస్మాయిల్, గూడూరు మండలం కోబల్తండాకు చెందిన దరంసోత్ శ్రీను, హాముతండాకు చెందిన దారావత్ కిరణ్కుమార్, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండ గ్రామానికి చెందిన పల్లెకొండ సాంబమూర్తి అనే నలుగురు వ్యక్తులు కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా పరిసర ప్రాంతంలోని ఓ వ్యక్తి వద్ద నుంచి గంజాయిని తీసుకుని భద్రాచలం నుంచి ఇల్లందు, బయ్యారం, కొత్తగూడ, గంగారం మండలాల మీదుగా గూడూరు పరిసర ప్రాంతాల్లో నిలువ ఉంచుతారు.
అక్కడి నుంచి ద్విచక్రవాహనాలు, ఇతర మినీ వాహనాల ద్వారా కేసముద్రం చేరుకుని అక్కడి నుంచి రైళ్ల ద్వారా మహారాష్ట్రకు చేరవేసి లక్షల్లో లాభాలు గడిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే షేక్ ఇస్మాయిల్, దరంసోత్ శ్రీను, దారావత్ కిరణ్కుమార్, పల్లెకొండ సాంబమూర్తిలు కోబల్తండా వద్ద పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించగా వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం ఒప్పుకున్నారు. సదరు వ్యక్తుల వద్ద ఉన్న రూ. 10 లక్షల విలువైన 51 ప్యాకెట్ల (102కేజీ)ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై ఎన్డీ యాక్టు ప్రకారం 160/2021, అండర్ సెక్షన్ 8 (సీ), రెడ్విత్ 20(బీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు.
ముఠాపై పీడీయాక్టు కేసులు నమోదు చేస్తాం
కొంతకాలంగా గంజాయి రవాణా చేస్తున్న షేక్ ఇస్మాయిల్, దరంసోత్ శ్రీను, దారావత్ కిరణ్కుమార్, పల్లెకొండ సాంబమూర్తిలపై పీడీయాక్టు కేసులు పెట్టేందుకు ప్రణాళిక చేస్తున్నామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. గతంలో ఇలాంటి గంజాయి రవాణా చేస్తున్న ఓ వ్యక్తిపై ఇప్పటికే పీడీయాక్టు కేసు నమోదు చేసినట్లు వివరించారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలకు చదువుకునే యువత అలవాటు పడి తమ నిండు జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. అంతే కాకుండా గంజాయిని వివిధ రకాలుగా సేవించడం వల్ల తప్పుదారి పట్టే అవకాశం ఉన్న యువత వాటి జోలికి వెళ్లొద్దని చెప్పారు. యువత విషయంలో తల్లిదండ్రులే అప్రమత్తంగా ఉండి వారి ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంచి చెడు అలవాట్లకు గురికాకుండా చూసుకోవాలన్నారు.
నిందితులను అదుపులోకి తీసుకున్న ఎస్సైకి ప్రశంసా
గూడూరు కోబల్తండాలో ఉన్న గంజాయి ముఠాను చాకచక్యంగా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన గూడూరు ఎస్సై సతీష్ను ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ప్రశంసించారు. ఎస్సై సతీష్తో పాటు హెడ్ కానిస్టేబుల్ బిచ్యానాయక్, కానిస్టేబుళ్లు రవి, ఐలయ్య, సోమేశ్వర్, దామోదర్లకు అభినందించి క్యాష్ రివార్డులు అందించారు. అదే విధంగా ఈ కేసును చేదించేందుకు విలువైన సూచనలు సలహాలు ఇచ్చిన సీఐ రాజిరెడ్డి, అసిస్టెంట్ ఎస్పీ యోగేష్గౌతమ్లను ఎస్పీ కోటిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.