ఇబ్రహీంపట్నం : అక్క బావల మధ్య జరుగుతున్న గొడవలో తలదూర్చినందుకు సొంత బావమరిదినే, బావ దారుణంగా హత్య చేసిన సంఘటన ఆదిబట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని మన్నెగూడలో చోటు చేసుకుంది. ఆదిబట్ల సీఐ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన విశ్వప్రదాన్ సంజుక్త భార్యభర్తలు, విశ్వప్రదాన్కు బావమరిది బానామాజీ (22) ముగ్గురు మన్నెగూడలో భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. కొంతకాలంగా వీరు మన్నెగూడ సమీపంలోని సిరిటౌన్షిప్ వద్ద ఉంటున్నారు. మృతుడి బావ విశ్వప్రదాన్, అక్క సంజుక్త తరుచుగా గొడవపడుతుండేవారు. అందులో భాగంగానే సోమవారం రాత్రికూడా గొడవపడుతుండటంతో తన అక్క సంజుక్తకు మద్ధతుగా మృతుడు బానామాజీ వెల్లి బావను అడ్డుకోబోయాడు.
దీంతో కోపోద్రేకుడైన బావ విశ్వప్రదాన్ బావమరిది తలపై బండరాయితో మోది దారుణంగా హత్యచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తోడబుట్టిన వాడు హత్యకు గురికాగా, కట్టుకున్నవాడు కటకటాలపాలవటంతో సంజుక్త కన్నీరు మున్నీరవుతోంది.