నేరేడుచర్ల : దొంగతనాలు జరగకుండా చూడాల్సిన పోలీస్ ఇంట్లోనే దొంగతనం చేసి బంగారం, నగదు అపహరించకపోయి పోలీసులకే సవాలు విసిరాడు ఓ దొంగ. ఈ సంఘటన నేరేడుచర్ల పట్టణంలో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకొంది. సంఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. పాలకవీడు మండల పోలీస్ స్టేషన్లో కానిస్టేబులుగా విధులు నిర్వహిస్తున్న బురి ఉపేందర్ పట్టణంలోని ప్రగతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వెనుక భాగంలోని అద్ధె గృహంలో కుటుంబంతో నివసిస్తున్నాడు. ఉపేందర్ సోమవారం నైట్ డ్యూటీకి వెళ్లగా భార్య కోటేశ్వరి కోదాడలోని బంధువుల ఫంక్షన్కు వెళ్లింది. మంగళవారం తెల్లవారు జామున ఇంటి తలుపు గడియ విరగొట్టిలోనికి చొరబడ్డ దుండగులు బీరువలోంచి రూ. 4లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు.
తాళం పగులగొట్టి తలుపులు తీసి ఉంచిన విషయాన్ని గమనించిన పక్క ఇంటి వారు కానిస్టేబుల్ ఉపేందర్కు సమాచారం అందించారు. గృహానికి వచ్చిన ఉపేదర్ నేరేడుచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేరేడుచర్ల ఎస్ఐ నవీన్కుమార్, హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డిలు సంఘటనా స్థలాన్ని సందర్శించి క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరించారు. కానిస్టేబుల్ ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నేరేడుచర్ల ఎస్ఐ తెలిపారు.