హైదరాబాద్ : ఐపీఎల్ జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై పోలీసులు దృష్టి సారించారు. వనస్థలిపురంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులను రాచకొండ పోలీసులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదుగురిలో ప్రధాన నిందితుడు దేవినేని చక్రవర్తి అని పోలీసులు తెలిపారు. ఐపీఎల్ బెట్టింగ్ల కోసం చక్రవర్తి ప్రత్యేక యాప్ తయారు చేసి ఈ దందా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఈ ముఠా సభ్యుల నుంచి రూ. 10 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది బ్యాంకుల ఖాతాల్లో రూ. 90 లక్షలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో ఆ బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గతంలో గోవా, బెంగళూరులోనూ చక్రవర్తి భారీ ఎత్తున బెట్టింగ్ నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ప్రయివేటు సంస్థల పేరుతో ఆయా బ్యాంకుల్లో ఖాతాలను తెరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు.