భువనేశ్వర్ : తన తండ్రి సర్వీస్ రివాల్వర్తో బెదిరించి ఓ ప్రైవేట్ బ్యాంకులో రూ 15 లక్షలు లూటీ చేసిన పోలీస్ అధికారి కుమారుడి ఉదంతం ఒడిషాలోని సుందర్ఘఢ్ జిల్లాలో వెలుగుచూసింది. ఆపై మంగళవారం పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో నిందితుడిని అరెస్ట్ చేశారు. సుందర్ఘఢ్ పట్టణంలోని యాక్సిస్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిని ఇదే జిల్లాకు చెందిన సుందర్ఘఢ్ సదర్ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ కొడుకు జయ్దేవ్ నాయక్గా గుర్తించారు.
నాయక్ మంగళవారం మద్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బ్యాంకులోకి కస్టమర్గా అడుగుపెట్టాడు. నేరుగా క్యాషియర్ వద్దకు చేరుకుని అతడి తలకు తుపాకీ గురిపెట్టాడు. క్యాషియర్ అరుపులతో మేనేజర్ లంకేశ్వర్ మహారాణా ఇతర సిబ్బంది అప్రమత్తం కాగా వారివైపు తుపాకీ గురిపెట్టిన నిందితుడు బ్యాగ్లో క్యాష్ నింపాలని క్యాషియర్కు చెప్పాలని బ్యాంకు మేనేజర్ను బెదిరించాడు.
ఈ బ్యాగ్లో క్యాష్ నింపుకున్న తర్వాత నిందితుడు బైక్పై పారిపోయాడు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుపై రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై నిందితుడు నాయక్ కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపి శంకర రోడ్ సమీపంలో అతడిని అదుపులోకి తీసకున్నారు. నాయక్ నుంచి నగదు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆపై అతడిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు.