Chhattisgarh : ఛత్తీస్గఢ్లో విషాదం జరిగింది. తమ కొడుకు మరణాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జాంజిగిర్-చంపా జిల్లాలోని, శివ్రినారాయణ్ పోలీస్ స్టేషన్ పరిధి, ధర్దేయి గ్రామంలో ఆదివారం జరిగింది. మృతులను కృష్ణ పటేల్ (48), రమా బాయి (47)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణ పటేల్, రమా బాయి దంపతులకు ఒకే కొడుకు ఆదిత్య పటేల్ ఉండేవాడు.
అతడు రెండేళ్ల క్రితం 2024లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అంతే, అప్పటి నుంచి ఈ దంపతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. తమ ఒక్కగానొక్క కొడుకు లేడని జీర్ణించుకోలేకపోయారు. రెండేళ్లుగా ఊరు వాళ్లు, బంధువులతో కూడా పెద్దగా కలవడం మానేశారు. ఇక తమ కొడుకు లేడని తట్టుకోలేక ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తమ ఇంటి పెరటిలోని ఒక చెట్టుకు ఆదివారం రాత్రి ఇద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మరుసటి రోజు ఉదయం వారి మృతదేహాలను స్తానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. దంపతులు ఆత్మహత్య చేసుకునే ముందు నాలుగు పేజీల లేఖ రాశారు.
తమ కొడుకు మృతిని తట్టుకోలేకే మరణిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంలో ఎవరి తప్పూ లేదని, సంతోషంగా తమ అంత్యక్రియలు నిర్వహించాలని లేఖలో కోరారు. అంతేకాదు.. తమ ఆస్తిని తన సోదరులకు ఇవ్వాల్సిందిగా అంతకుముందు వారి లాయర్కు వీడియో పంపారు. అలాగే ఆదిత్య మరణం ద్వారా వచ్చిన పరిహారాన్ని కూడా వారికే అందించాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.