చెన్నై : కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసిలా చెప్పుకుంటూ ఆలయాల వెలుపల గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. రోయపేటాకు చెందిన ఎం దాము (50) సన్యాసి వస్త్రధారణతో ప్రజలను బోల్తా కొట్టిస్తూ మైలాపూర్, రోయపేటా ప్రాంతాల్లోని ఆలయాల వద్ద గంజాయిని విక్రయిస్తుంటాడనే సమాచారంతో పోలీసులు వలపన్ని పట్టకున్నారు. గంజాయి కొనుగోలుదారులుగా చెబుతూ పోలీసులు ఓ ఆలయం వద్ద దామును కలిశారు.
న్యూస్ పేపర్లలో గంజాయిని వారికి ఇస్తుండగా పోలీస్ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. పోలీసులు అతడి వద్ద నుంచి ఏడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాము ఇచ్చిన సమాచారంతో ఎం రాజా, అసైతమిని అనే ఇద్దరు సహచరులనూ అరెస్ట్ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా వారానికో ప్రాంతంలో దాము గంజాయి విక్రయం సాగిస్తుంటాడని పోలీసులు తెలిపారు.
వీరు ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయిని కొనుగోలు చేసి దాన్ని తమిళనాడులో విక్రయిస్తున్నారని వెల్లడైంది. దాము అతడి సహచరులు విద్యార్ధులను టార్గెట్ చేసి వారికి గంజాయి విక్రయిస్తున్నట్టు సమాచారం. తమిళనాడు పోలీసులు గత రెండువారాలుగా భారీ డ్రైవ్ నిర్వహించి 1400 కిలోలు పైగా గంజాయిని సీజ్ చేశారు. గుట్కా, గంజాయి విక్రయిస్తున్న 5000 మందిని అదుపులోకి తీసుకున్నారు.