మేడ్చల్ జిల్లాలో కారు బీభత్సం
ముగ్గురి దుర్మరణం, నలుగురికి గాయాలు
మేడ్చల్, సెప్టెంబర్ 11: అతివేగం ముగ్గురి నిండు ప్రాణాలను బలిగొన్నది. నలుగురిని క్షతగాత్రులుగా మార్చింది. వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి అవతలవైపు ఎదురుగా వస్తున్న ఆటో, బైకులపైకి దూసుకెళ్లింది. మేడ్చల్ జిల్లాలో బీభత్సం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నా యి. శనివారం సాయంత్రం మెదక్ జిల్లా తూప్రాన్ నుంచి మేడ్చల్ వైపు వస్తున్న కారు మేడ్చల్ మండలంలోని రేకులబావి వద్ద 44వ జాతీయ రహదారిపై అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా డివైడర్ దాటి అవతలి వైపు ఎదురుగా వస్తున్న ప్యాసింజర్ ఆటో, ఓ బైక్పైకి దూసుకెళ్లింది. అలాగే ఓ లారీ కిందికి వెళ్లి ఆగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న తూప్రాన్ మండల బ్రాహ్మణపల్లికి చెందిన లావణ్య (30) అక్కడికక్కడే మృతిచెందగా, ఆమె కొడుకు కౌశిక్ (3) దవాఖానాలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆటోలోనే ప్రయాణిస్తున్న మరో నలుగురికి గాయాలయ్యాయి. బైక్పై వెళ్తున్న సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూర్కు చెందిన సుధీర్వర్మ (25) ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. కారు అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ప్రవీణ్రెడ్డి వెల్లడించారు.