టెక్ కంపెనీలో పని చేస్తూ బిజీగా ఉండే ఆ వ్యక్తి.. సెలవు దొరకగానే కుటుంబంతో సరదాగా గడిపేందుకు వచ్చాడు. భార్యాపిల్లలతో పాటు చెల్లెలు, ఆమె పిల్లలను కూడా తీసుకొని సినిమాకెళ్లాడు. సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అలా చేయడమే ప్రాణాల మీదకు తెస్తుందని అతను కలలో కూడా ఊహించి ఉండదు.
ఈ ఘటన చెన్నైలోని నవలూర్లో జరిగింది. ఎస్. ఉమేందర్ అనే టెకీ.. తన భార్య భవ్య, పిల్లలు, చెల్లెలు దేవీప్రియ, ఆమె పిల్లలను తీసుకొని దగ్గరలోని ఒక మాల్లో సినిమాకు వెళ్లాడు. సినిమా పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 3.25 గంటల ప్రాంతంలో ఒక ఇన్నోవా క్యాబ్ బుక్ చేశాడు. తను బుక్ చేసిన క్యాబ్ రావడం చూసి దాని దగ్గరకు వెళ్లాడు.
దాని డ్రైవర్ రవి.. ఓటీపీ చెప్పాలని అడిగాడు. అదే సమయంలో ఉమేందర్ పిల్లలు కారులోకి ఎక్కేశారు. అది చూసిన డ్రైవర్ రవికి కోపం వచ్చేసింది. వాళ్లను గట్టిగా తిడుతూ కిందకు దింపేశాడు. ఏడుగురు ఉండగా ఇంత చిన్న క్యాబ్ ఎలా బుక్ చేసుకున్నారని ప్రశ్నించాడు. అతని ప్రవర్తన నచ్చకపోవడంతో ఉమేందర్ చిరాకు పడ్డాడు.
ఈ క్రమంలో వాగ్వాదం జరిగి, డ్రైవర్ రవి తన మొబైల్ తీసి ఉమేందర్ తలపై పగలగొట్టాడు. అక్కడితో ఆగకుండా అతనిపై విపరీతంగా దాడి చేశాడు. కుటుంబం కళ్ల ముందే స్పృహ తప్పిన ఉమేందర్ను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రవిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.