రాంచీ : జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. దాదాపు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో కనీసం ఆరుగురు మృతి మృత్యువాతపడగా.. పలువురు గాయపడ్డట్లు పోలీసులు తెలిపారు. గిరిదిహ్ జిల్లా నుంచి రాంచీ వెళ్తున్న బస్సు తతిజారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని సివాన్నే నదిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
బస్సులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టినట్లు ఎస్పీ మనోజ్ రతన్ తెలిపారు. ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు విడువగా.. మరో నలుగురు ఆసుపత్రిలో మృతి చెందినట్లు హజారీభాగ్లోని సదర్ ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. పలువురికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.
ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న వారిని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్)కు పంపేందుకు సన్నాహలు చేస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే, నది మధ్యలో నీటిలో బస్సు పడిపోయి ఉంటే ప్రాణనష్టం ఎక్కువగా ఉండేదని పోలీసులు తెలిపారు. కొందరు ప్రయాణికులు బస్సులోనే ఇరుక్కుపోయరని, వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షించేందుకు డీఎస్పీ ర్యాంక్ అధికారి, ముగ్గురు పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్లను సంఘటనా స్థలం వద్ద మోహరించినట్లు ఎస్పీ వివరించారు.