బంజారాహిల్స్ : సెల్టవర్ల నిర్మాణం కాంట్రాక్టు పనుల పేరుతో బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 11లోని గౌరీశంకర్ కాలనీలో నివాసం ఉంటున్న చందన్దాస్ అనే వ్యక్తి రెయిన్బో ఆస్పత్రిలో క్యాంటీన్ సూపర్వైజర్గా పనిచేస్తుంటాడు. గతంలో సెల్ఫోన్ టవర్ల నిర్మాణ పనుల్లో అనుభవం ఉన్న చందన్దాస్ ఆన్లైన్లో పనుల కోసం గూగుల్లో వెతికాడు.
బీఈఎస్ టెక్పవర్ కంపెనీ అనే సంస్థలో పనులున్నాయని, దరఖాస్తు చేసుకోవాలని వచ్చింది. దాంతో రెండునెలల క్రితం తన వివరాలను నమోదు చేశాడు. వాట్సాప్ ద్వారా కాంటాక్ట్లోకి వచ్చిన ఓ వ్యక్తి అతడికి సంబంధించిన డాక్యుమెంట్స్ను తీసుకున్నాడు. డిపాజిట్ కింద రూ.28,499 కట్టాల్సి ఉంటుందని, గూగుల్ పే నెంబర్ ఇచ్చాడు. దాంతో ఆ మొత్తాన్ని చెల్లించాడు.
అయితే మరింత డబ్బు కావాలంటూ వాట్సాప్లో కోరుతుండడంతో అనుమానం వచ్చి ఆరా తీయగా మోసమని తేలింది. దీంతో సైబర్ క్రైం పోర్టల్లో ఫిర్యాదు చేయగా డబ్బులు వెళ్లిన అకౌంట్ను ఫ్రీజ్ చేశారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించగా బాధితుడు చందన్దాస్ శనివారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.